తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు... నారాయణ హృదయాలయ వైద్యులు..
సినీనటుడు తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నారాయణ హృదయాల వైద్యులు మంగళవారం తెలిపారు.
బెంగళూరు : నందమూరి తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నారాయణ హృదయాలయ వైద్యులు మంగళవారం తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. సోమవారం ఆయన ఆరోగ్యం మీద హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు పరిస్థితి ఇంకా విషమంగాను ఉందని తెలిపారు. ఆయనకు ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని ప్రకటించారు.
ఈ నెల 27న కుప్పంలో ప్రారంభమైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. సినీ నటుడి నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం 11గంటలకు కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. నారా లోకేష్ తో పాటు పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. అయితే పాదయాత్ర ప్రారంభమైన కాసేపటి తర్వాత.. ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స
అయితే పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత దగ్గర్లోని మసీదులో లోకేష్ ప్రార్థనలు చేశారు. కాగా, ఈ సమయంలో లోకేష్ తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. మసీదు నుంచి బయటికి వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఆ తాకిడికి రత్న సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వెంటనే స్థానిక టిడిపి నేతలు ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆయనకు 45 ని.లపాటు పల్స్ అందకపోవడం.. మనిషి నీలంగా మారిపోవడంతో.. ప్రథమ చికిత్సలో భాగంగా సీపీఆర్ చేశారు. హార్ట్ బీట్ వచ్చిందని చెబుతున్నారు. కార్డియాలజిస్ట్ కు హ్యాండోవర్ చేశారు. ఆ తరువాత కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. ఐసీయూలో ప్రస్తుతం చికిత్స అందించారు. టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకుని పరిశీలిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ తరువాత రోడ్డు మార్గం ద్వారా మెరుగైన వైద్యంకోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ నారాయణ హృదయాలయాలో చికిత్స అందిస్తున్నారు.