ఆంధ్రప్రదేశ్ లో బొగ్గు కొరత: సరఫరా పెంచాలని కెసిఆర్ ను కోరిన జగన్
భారీ వర్షాలు, కార్మికుల సమ్మె నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి బాగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు బొగ్గును సరఫరా చేసే సింగరేణి, మహానంది బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి తగ్గడంతో సరఫరా కూడా గణనీయంగా తగ్గింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడింది. భారీ వర్షాలు, కార్మికుల సమ్మె నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి బాగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు బొగ్గును సరఫరా చేసే సింగరేణి, మహానంది బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి తగ్గడంతో సరఫరా కూడా గణనీయంగా తగ్గింది.
బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. బొగ్గు ఆధారితంగానే థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇంధనమే లేకపోవడంతో విద్యుతుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ప్రస్తుతం తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నుంచి 4 ర్యాకుల బొగ్గు ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది. ఈ సరఫరాను పెంచాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు. ప్రస్తుతం వస్తున్న 4 ర్యాకుల బొగ్గును 9ర్యాకులకు పెంచాలని కోరారు.
బొగ్గుసరఫరాలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక లేఖ కూడా రాసారు.