సీఎం జగన్తో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపైన సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఉద్యోగులు విజయవాడకు రాకుండా తీసుకుంటున్న చర్యలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. సీఎం జగన్కు వివరించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ కూడా ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి దిశా నిర్దేశం చేసినట్టుగా సమాచారం. మరోవైపు వినాయక చవితి మండపాలకు అనుమతులు, భద్రతపైన కూడా డీజీపీతో సీఎం జగన్ ఈ సందర్భంగా చర్చించారు.
ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపుమేరకు ఉద్యోగులు కదం తొక్కారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్పై ఆకస్మిక బదిలీ వేటు పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.