తిరుమల వెంకన్నకు స్వర్ణ కిరీటం బహుకరణ
1,600 గ్రాముల బరువు గల స్వర్ణ కిరీటాన్ని రూ.28 లక్షలతో, 1,600 గ్రాముల బరువు గల రెండు వెండి పాదాలను రూ.2 లక్షలతో భక్తుడు తయారు చేయించినట్లు సుధాకర్యాదవ్ వెల్లడించారు.
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు బంగారు కిరీటం, పాదాలకు వెండి తొడుగులు బహుకరించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తానికి చెందిన కె.దొరస్వామియాదవ్ దంపతులు సోమవారం తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్యాదవ్ను కలిసి ఈ కానుకలు అందజేశారు. 1,600 గ్రాముల బరువు గల స్వర్ణ కిరీటాన్ని రూ.28 లక్షలతో, 1,600 గ్రాముల బరువు గల రెండు వెండి పాదాలను రూ.2 లక్షలతో భక్తుడు తయారు చేయించినట్లు సుధాకర్యాదవ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పించి స్వామిపై తమ భక్తిని చాటుకుంటున్నారని అన్నారు. భక్తుడు దొరస్వామి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే తాను పాల వ్యాపారంలో అభివృద్ధి సాధించానని, అందులో వచ్చిన లాభాలనే స్వామికి కానుకలుగా సమర్పించుకున్నానని తెలిపారు.