మహిళా కార్పోరేటర్లపై చేతులు వేస్తారా?: పోలీసులకు దేవినేని ఉమ ఆగ్రహం
విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద టిడిపి నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ టిడిపి కార్పోరేటర్లను కౌన్సిల్ సమావేశానికి రాకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు.
విజయవాడ: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లను వెళ్లకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. మహిళలు అని కూడా చూడకుండా వాళ్ళ మీద ఎక్కండంటే అక్కడ చేతులు వేస్తున్నారు అని మండిపడ్డారు.
విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద టిడిపి నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన 196,197,198 జి.ఓ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెత్త మీద పన్ను వేయాలన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
''ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే చెత్త పన్ను టైంకు కట్టకపోతే మళ్ళీ పెనాల్టీ వేస్తారంటా. మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ప్రాంతాల్లో జీవించే ప్రజల మీద పెద్ద ఎత్తున పన్నులు వేశారు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రులు దగ్గర సమాధానం లేదు... ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు'' అన్నారు.
''బ్యాంక్ లో ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చుకోడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప మరొకటి లేదు. మా కార్పోరేట్లను మీటింగ్ కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? రాష్ట్రంలో చట్టబద్దమైన పరిపాలన లేదు'' అని మండిపడ్డారు.
''తాడేపల్లి రాజప్రాసాదం వద్ద రెండు సంవత్సరాల నుంచి 144 సెక్షన్ అమల్లో పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడు. ఈ సీఎం వచ్చాక పెద్ద ఎత్తున నిత్యావసర ధరలు పెరిగాయి. ఇప్పుడు చెత్త మీద కూడా పన్ను వేసి దోచుకుంటుంది ఈ చెత్త ప్రభుత్వం'' అని విమర్శించారు.
''మొత్తం 41వేల కోట్లకు లెక్కలు లేవు... ఆ డబ్బులు ఎటు ఖర్చుబెట్టారో తెలియదు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చెత్త మీద పన్ను వేసి దోచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే వైసిపి ప్రభుత్వా చెత్త మీద పన్ను వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి'' అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.