Asianet News TeluguAsianet News Telugu

పందికొక్కుల్లా ఇసుక దోపిడి...వైసిపి ప్రభుత్వంపై దేవినేని ఉమ ఆగ్రహం

రాష్ట్ర సాగునీటి చరిత్రలో గడిచిన తెలుగుదేశం ఐదేళ్ల పాలన స్వర్ణయుగంగా నిలిచిపోతుందని... ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఇరిగేషన్ శాఖలో రూ. 63,373 కోట్లు ఖర్చు చేశారని మాజీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ తెలిపారు. 

Devineni  uma allegations on  ys jagan govt
Author
Amaravathi, First Published Jun 19, 2020, 8:59 PM IST

విజయవాడ: రాష్ట్ర సాగునీటి చరిత్రలో గడిచిన తెలుగుదేశం ఐదేళ్ల పాలన స్వర్ణయుగంగా నిలిచిపోతుందని... ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఇరిగేషన్ శాఖలో రూ. 63,373 కోట్లు ఖర్చు చేశారని... చివరి ఏడాదిలోనే కూడా రూ.13,988 కోట్లు వెచ్చించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
 మేజర్, మైనర్, మీడియం ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టు, డెల్టా మోడ్రనైజేషన్, ఫ్లడ్ బ్యాంక్, నీరు-చెట్టు.. ఇలా అన్ని పనులలో కలిపి రూ.63,373 కోట్లు ఖర్చు చేయడమైనదని అన్నారు. 

'' తెలుగుదేశం హయాంలో 62 సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించగా.. 23 ప్రాజెక్టులు పూర్తిచేయడమైనది. 26 ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ లో ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్న మాచర్ల లిఫ్ట్ వరికశలపూడి కూడా తెలుగుదేశం హయాంలో 61 ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. గోదావరి-పెన్నా అనుసంధానం మొదటి ఫేజ్ కూడా టెండర్లు పిలిచి.. పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన చేయడంతో పాటు పనులు కూడా ప్రారంభించాం'' అని వెల్లడించారు. 

''వైకాపా అధికారంలోకి వచ్చిన 12 నెలల్లో ఆ పనులన్నింటినీ రద్దు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 62 ప్రాజెక్టుల వల్ల 20,19,053 ఎకరాల కొత్త ఆయకట్టు, 45,09,124 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు వస్తుంది. వైకాపా నాయకులు పట్టిసీమను ఒట్టిసీమ అన్నారు, అధికారంలోకి రాగానే పట్టిసీమ పంపులు పీకేస్తామన్నారు. ఇప్పుడు అదే పట్టిసీమ వారికి దిక్కయింది. ప్రతిపక్షంలో ఉండగా పట్టిసీమకు భూములను ఇస్తున్న రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైకాపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. 12 నెలల్లో పట్టిసీమను పూర్తిచేశాం'' అని తెలిపారు. 

''8.8 టీఎంసీలతో తొలి ఏడాదే 2,500 కోట్ల పంటను కాపాడాం. పట్టిసీమతో నాలుగేళ్లలో రూ. 44వేల కోట్ల ఉత్పాదక శక్తి జరిగింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన ఏడాదిలో శ్రీశైలం ప్రాజెక్టుకి 8 సార్లు వరద వచ్చినా.. 800 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పులిచింతలలో 45 టీఎంసీలు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ.. 30 టీఎంసీలు కూడా నిలబెట్టలేకపోయారు. కనీసం పులిచింతల నుంచి గ్రావిటీతో నీళ్లు తెచ్చుకుని నారుమళ్లు కూడా కాపాడలేని దౌర్భగ్య స్థితి కల్పించారు. ఇది మీ చేతగానితనం కాదా..?'' అని మండిపడ్డారు. 

read more   అనుకున్నదే: రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్, వర్ల ఓటమి

''కృష్ణా-గుంటూరు జిల్లాలలోని వైకాపా ఎమ్మెల్యేల అనుచరులు నదిలో అడ్డంగా రోడ్లు వేసి మరీ పందికొక్కుల్లా ఇసుకను తవ్వేస్తున్నారు. వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు..? పట్టిసీమ నీరు మీద చల్లుకొని అయినా మీ పాపాలు కడుక్కోండి. ఏడాది కాలంలో పూలసుబ్బయ్య వెలిగొండ సొరంగం-1 పనులు పూర్తిచేస్తామని గత బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ ఏడాది పాలనలో పూర్తిచేయలేకపోయారు. టన్నెల్ 1, 2 పనులలో అవినీతి జరిగిందని ఆరోపించారు. టన్నెల్ 2 పనులలో రివర్స్ టెండరింగ్ కి పిలిచి.. తిరిగి టన్నెల్ 1 చేసే వారికే అప్పగించారు'' అని మండిపడ్డారు. 

''తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టులో 24 గంటల్లో 32,434 క్యూ.మీ. కాంక్రీట్ వేసి.. గిన్నీస్ రికార్డు సాధించాం. కానీ వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో నెలల తరబడి ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేసి చిత్తూరు వరకు నీరు తీసుకెళ్తామన్నారు. ఏడాది కాలంలో ఎంత పనులు జరిగాయో..? ఎన్ని లక్షల క్యూ.మీటర్ల కాంక్రీట్ పని జరిగిందో చెప్పగలరా..? సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులో ఏడాది కాలంలో ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా..? 2019-20 లో రూ.13,139 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించి.. ఏడాదిలో రూ.4,941 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో మీ అనుయాయులకు ఎంత చెల్లించారు..? ఖర్చు పెట్టిన బడ్జెట్ పై చర్చ జరపకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు పారిపోయారు..?'' అని దేవినేని ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios