కుక్కకుండే విశ్వాసం కూడా రఘురామకు లేదు: డిప్యూటీ సీఎం ఆగ్రహం
ముఖ్యమంత్రి జగన్ ఎంతో నమ్మకంతో రఘురామను ఎంపీని చేశారని... కానీ ఆయనకు కుక్కకు ఉన్నంత విశ్వాసం కూడా లేదని మంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు.
చిత్తూరు: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎంతో నమ్మకంతో రఘురామను ఎంపీని చేశారని... కానీ ఆయనకు కుక్కకు ఉండే విశ్వాసం కూడా లేదన్నారు.
మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రి సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టిడిపి నాయకులు కోర్టులకు వెళ్లి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు సూచనలతోనే అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటూ కోర్టులకు వెళుతున్నారని అన్నారు. ఇలా అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళేవారందరూ తన దృష్టిలో దరిద్రులేనని నారాయణస్వామి అన్నారు.
read more సెక్షన్ 124ఏను రద్దు చేయండి.. ఏపీ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లకు రఘురామ లేఖ
గతంలో కూడా సుప్రీం, హైకోర్టులపై కూడా నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు తయారు చేయవని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామన్నారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల కేసులను కోర్టులు త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. ఉన్నవాళ్లు భూకబ్జాలు చేస్తారు, పేదవాళ్లు చేయరని ఆయన అన్నారు.