టీడీపీలో చేరితే రూ.30 కోట్లు, మంత్రిపదవి ఇస్తామన్నారు.. ఉపముఖ్యమంత్రి రాజన్నదొర సంచలనం..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర తెలుగుదేశం పార్టీ మీద సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారితే తనకు 30కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు.
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరడానికి తనతో బేరం పెట్టారని ఆరోపించారు. పిల్లలకు చదువుతో పాటు రూ. 30 కోట్లు, మంత్రి పదవి.. అమరావతిలో ఇల్లు ఇస్తామని అన్నారన్నారు. అయితే తనకు తమ నాయకుడు జగన్ పై ఉన్న నమ్మకం.. అభిమానంతోనే వారిని తిరస్కరించానని.. పార్టీ మారలేదని పేర్కొన్నారు. శుక్రవారం విజయనగరంలో జరుగుతున్న వైసిపి జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన మాట్లాడారు.
టీడీపీలోకి వెళ్లక పోవడం వల్లే తాను ఈ రోజు మంచి పదవిలో ఉన్నాను అని తెలిపారు. మొదటిసారి తనకుమంత్రి పదవి రానందుకు అసంతృప్తి వ్యక్తం చేయలేదని.. తనకు కాకుండా పుష్పశ్రీవాణి అవకాశం ఇచ్చిన.. తాను ఒక మాట కూడా అనలేదని వివరించారు. పత్రికల్లో, టీవీలో వస్తున్న వార్తల్లో ఏది నిజమో ప్రజలే తెలుసుకోవాలని సూచించారు. డ్వాక్రా రుణాల మాఫీ టిడిపి హయాంలో వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ. 27 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చూస్తూ వుండండి... వైసిపి నుండి టిడిపిలోకి భారీ వలసలు: అచ్చెన్నాయుడు సంచలనం
ఇదిలా ఉండగా జూన్ 28 న గుడివాడలో జరిగిన ప్లీనరీలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని అన్నారు. దీన్ని ఎవరూ చెక్కుచెదర లేరని అన్నారు. కార్యకర్తల కష్టం, పోరాటాల ఫలితంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు గుడివాడ వైసీపీ ప్లీనరీ లో ముఖ్యఅతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. అంతే కాదు మరో పాతికేళ్లపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. Chandrababu తన దుష్టచతుష్టయం తో కలిసి వచ్చినా కూడా కొడాలి నాని ని ఓడించలేరని మంత్రి రమేష్ సవాల్ చేశారు.
కొడాలి నాని దెబ్బకి చంద్ర బాబుకు నిద్ర పట్టడం లేదని.. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. గుడివాడ కు బ్రాండ్ తెచ్చింది కోడలి నాని అని ఆయన గుర్తు చేశారు. గుడివాడ లో కొడాలి నానిని ఓడించాలని టిడిపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటుంది అన్నారు. అసలు టిడిపి నుంచి గుడివాడలో ఎవరు పోటీ చేస్తారని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అనే స్థాయి నుండి కొడాలి నాని ని ఓడిస్తా అనే స్థాయికి chandrababu ఇవాళ దిగజారి పోయారు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.