ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా  ఉన్న  మాగుంట  రాఘవ  ఇవాళ న్యూఢిల్లీలోని ఈడీ అధికారుల ముందు  లొంగిపోయాడు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ సోమవారంనాడు ఈడీ అధికారుల ముందు లొంగిపోయారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ ను రెండు వారాల నుండి ఐదు రోజులకు కుదించారు. దీంతో ఇవాళ మాగుంట రాఘవ ఈడీ అధికారులకు లొంగిపోయారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవకు ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. తన అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందని బెయిల్ కోరాడు మాగుంట రాఘవ. ఆరు వారాలకు బదులుగా రెండు వారాల పాటు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. 

మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఈడీ ఈ నెల 8వ తేదీన సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై ఈ నెల 9వ తేదీన విచారణ నిర్వహించింది సుప్రీంకోర్టు. మధ్యంతర బెయిల్ పై స్టే ఇవ్వాలని ఈడీ కోరింది. బెయిల్ విషయమై మాగుంట రాఘవ అబద్దాలు చెప్పారని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రెండు వారాల పాటు ఇచ్చిన బెయిల్ ను ఐదు రోజులకు కుదిరించింది సుప్రీంకోర్టు. ఈ నెల 12న లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ ఈడీ అధికారులకు లొంగిపోయారు మాగుంట రాఘవ.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్

ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పలుమార్లు ఆయనను విచారించారు. అనంతరం రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడే మాగుంట రాఘవ.