ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు .. తుగ్లక్ చర్యే, జగన్ ప్రతిదాన్ని కెలుకుతున్నారు : సీపీఐ రామకృష్ణ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు యూనివర్సిటీల్లో సిబ్బందిని భర్తీ చేయడం, అక్కడ సౌకర్యాలను కల్పించడంపై సీఎం జగన్ దృష్టిపెట్టాలని రామకృష్ణ హితవు పలికారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ భగ్గుమన్నారు. ప్రతిసారి పలు అంశాలను వివాదాస్పదం చేయడం జగన్కు అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తుగ్గక్ చర్యేపనని.. జగన్ కక్షపూరిత పాలన సాగిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొత్తగా ఒక యూనివర్సిటీనైనా స్థాపించారా అని ఆయన ప్రశ్నించారు. ముందు యూనివర్సిటీల్లో సిబ్బందిని భర్తీ చేయడం, అక్కడ సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టాలని రామకృష్ణ హితవు పలికారు.
కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు. వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు.
ALso REad:చంద్రబాబు, కరువు కవలపిల్లలు: ఏపీ అసెంబ్లీలో జగన్
అనంతరం ఈ విషయమై సీఎం జగన్ కూడా ప్రసంగించారు. ఎన్టీఆర్ ను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. వైద్య రంగంలో సేవలు చేసినందుకే వైఎస్ఆర్ పేరును మెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఆ టర్మ్ కూడా పూర్తి కాలం పాటు పదవిలో ఉండేవారేమోనని జగన్ అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు నాయుడు ఏనాటికి కూడా సీఎం కాకపోయి ఉండేవారేమోననే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.