కోవిడ్19 ఎఫెక్ట్... మొట్టమొదటిసారి ఆన్ లైన్ లో శ్రీవారి కల్యాణోత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవం మొట్టమొదటి సారి ఆన్ లైన్ లో జరగనుంది.
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవం మొట్టమొదటి సారి ఆన్ లైన్ లో జరగనుంది. కోవిడ్ - 19 విజృంభణ నేపథ్యంలో భక్తుల కోరికను మన్నించిన టిటిడి ఆగస్టు 7వ తేదీ(శుక్రవారం) నుండి ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.
ఆగస్టు 7 నుండి 31వ తేదీ వరకు గల కల్యాణోత్సవం టికెట్లను ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 11.00 గంటల నుండి ఆన్ లైన్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని టిటిడి ప్రకటించింది. టికెట్లు కావలసిన భక్తులు టిటిడి వెబ్సైట్లో(www.tirupatibalaji.ap.gov.in)తమ వివరాలు పొందుపర్చి, టిటిడి నియమ నిబంధనలకు లోబడి గేట్వే ద్వారా రూ.1000/- చెల్లించి ఆన్లైన్ రశీదు పొందవచ్చని తెలిపారు. ఇక శ్రీవారి ప్రసాదాలను పోస్టల్ శాఖ ద్వారా టిటిడి ఉచితంగా అందిస్తుందన్నారు.
స్వామివారి కల్యాణోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి, అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుంది. కాగా ఆన్ లైన్ లో టికెట్లు పొందిన భక్తులు గోత్ర నామాలను స్వామివారికి నివేదిస్తారు.ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరియం, రవిక, అక్షింతలు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపడం జరుగుతుంది.
టికెట్లు బుక్ చేసుకునే విధానం
ముందుగా www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కల్యాణోత్సవం (ఆన్లైన్ పార్టిసిపేషన్) అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్ లో టిక్ గుర్తు పెట్టాలి. ఆ తర్వాత కల్యాణోత్సవం తేదీని, గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపిణీ కోసం చిరునామా వివరాలు పొందుపరచాలి. ఈ సమాచారాన్ని సరిచూసుకొని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది. ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్ ద్వారా సదరు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు. పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుందని టిటిడి తెలిపింది.