దంపతుల సెల్ఫీ వీడియో కథ విషాదాంతం : కొప్పాక కాలువలో దొరికిన మృతదేహాలు...
గాజువాకకు చెందిన దంపతులు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని కనిపించకుండా పోయారు. వారి మృతదేహాలు బుధవారం కొప్పాక ఏలేరు కాలువలో దొరికాయి.
అనకాపల్లి : తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన దంపతుల సెల్ఫీ వీడియో ఘటన విషాదాంతంగా ముగిసింది. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని ఓ దంపతులు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని.. బంధువులకు పంపి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తిరుమనగర్ కు చెందిన వరప్రసాద్ (47), మీరా (41) దంపతులు. వీరు సోమవారం సాయంత్రం తాము ఆత్మహత్య చేసుకున్నట్లుగా సెల్ఫీ వీడియో తీసి దాన్ని బంధువులకు పంపించి కనిపించకుండా పోయారు. వీరి మృతదేహాలు అనకాపల్లి జిల్లా రాజపాలం సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువలో దొరికాయి.
ఆ సెల్ఫీ వీడియోలో వారు మాట్లాడుతూ…‘మేమిద్దరం వెళ్ళిపోతున్నాం... మా పిల్లల్ని ఎవరూ ఏమీ అనొద్దు. జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పిల్లలూ మీరు పట్టించుకోకండి’ అని సెల్ఫీ వీడియో తీసుకున్నారు దంపతులు. ఆ వీడియోను బంధువులకు పంపించారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. వీరి కొడుకు కృష్ణతేజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వారికోసం గాలింపు చేపట్టారు. కాగా, అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువ వద్ద దంపతుల ఫోన్ సిగ్నల్ చివరిసారిగా కనిపించింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. కాలువలో వారి మృతదేహాలు దొరికాయి.
విశాఖలో దంపతుల మిస్సింగ్ కలకలం.. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సెల్పీ వీడియో..
ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరప్రసాద్, మీరా దంపతులు 87వ వార్డు తిరుమలానగర్ సమీపంలోని శివాజీ నగర్ లో ఉంటున్నారు. చిత్రాడ ప్రసాద్ విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్ఎంఎస్-2 విభాగంలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె దివ్యలక్ష్మి.. ఆమెకు నిరుడు వివాహమైంది. కొడుకు కృష్ణసాయితేజ. అతను బ్యాటరీ షాప్ నడుపుతున్నాడు. సోమవారం సాయంత్రం సెల్ఫీవీడియో తీసుకొని ఈ దంపతులిద్దరూ బంధువులకు పంపారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆ వీడియో చూసి కంగారుపడి.. వారిని కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించిన బంధువులకు వారి ఆచూకీ దొరకలేదు. అప్పటికే వారు ఎటో వెళ్లిపోయారు.
దీంతో దువ్వాడ పోలీసులకు కుమారుడు కృష్ణసాయి తేజ తల్లిదండ్రుల సెల్ఫీ వీడియో వివరాలు తెలిపి మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారి ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొప్పాక ఏలేరు కాలువ వద్దకు వెళ్లి చూశారు. కాలువ గట్టు దగ్గర వారి చేతి సంచి, ఇతర వస్తువులు, చెప్పులను గుర్తించారు. మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లను పిలిపించి కాలువలో వెతికించారు. కానీ, రాత్రి వరకు కూడా ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం కూడా గాలింపు కొనసాగించారు. బుధవారం నాడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయడంతోనే.. ఒత్తిడి పెరిగి ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఉంటారని స్థానికులు చెబుతున్నారు..