వదిలించుకోవాలనుకున్న ఆ ప్లాంటే.. ఇప్పుడు ప్రాణదాత, దటీజ్ వైజాగ్ స్టీల్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కరోనాపై పోరులో వ్యాక్సిన్, వెంటిలేటర్లు, బెడ్స్ ఇతరత్రా సామాగ్రి కొరత రాష్ట్రాలను వేధిస్తోంది
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కరోనాపై పోరులో వ్యాక్సిన్, వెంటిలేటర్లు, బెడ్స్ ఇతరత్రా సామాగ్రి కొరత రాష్ట్రాలను వేధిస్తోంది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిదారులు చేతులెత్తేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ అవసరం నానాటికీ పెరుగుతోంది.
బాధితులకు చికిత్సలో కీలకమైన ప్రాణవాయువు సరఫరా ఎక్కడా ఆగకుండా కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ విషయంలో స్టీల్ప్లాంట్లు ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆక్సిజన్ ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తూ రాష్ట్ర, దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది.
Also Read:మనిషినే కాదు మానవత్వాన్ని చంపిన కరోనా... రైలుకి ఎదురెళ్ళి కోవిడ్ రోగి ఆత్మహత్య
కరోనా కట్టలు తెంచుకుంటున్న వేళ ప్రాణవాయువు కొరత లేకుండా ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాలన్నింటికీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సెయిల్, విశాఖ స్టీల్ప్లాంట్, జేఎస్పీఎల్, జేఎస్డబ్ల్యూ వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు కర్మాగారాలు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇక కరోనా బాధితుల చికిత్సలో అత్యవసరమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో విశాఖ ఉక్కు కర్మాగారానిది ప్రముఖ స్థానం. గతేడాది కరోనా విజృంభించిన వేళలోనూ నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసిన ఘనత వైజాగ్ స్టీల్దే.
నగరంలోని ప్రఖ్యాత కింగ్జార్జ్ ఆసుపత్రితో పాటు సమీప యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో వైజాగ్ స్టీల్ మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని విశాఖ ఉక్కు కార్మాగారం సిబ్బంది పేర్కొంటున్నారు.
కాగా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, రాజకీయ పార్టీలు గత కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నాయి.