తుమ్మల నాగేశ్వరరావుతో రేవంత్, థాక్రే, భట్టి .. కాంగ్రెస్లో చేరికపై చర్చ
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు తుమ్మలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరిక తేదీపై చర్చిస్తున్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు తుమ్మలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరిక తేదీపై చర్చిస్తున్నారు. అలాగే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై తుమ్మల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత తుమ్మల చేరిక తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
కాగా.. ఈ నెల 17న హైద్రాబాద్ లో జరిగే సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 21న కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు దక్కలేదు. పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
Also Read: ఈ నెల 17న కాంగ్రెస్లోకి తుమ్మల, మైనంపల్లి: సోనియా సమక్షంలో చేరిక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులుతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ఉండాలని తన అనుచరులకు తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతానని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు తేల్చి చెప్పారు. ఈ మేరకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో ఉన్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.