తప్పుడు సర్వేతో లగడపాటికి చిక్కులు: పోలీసులకు ఫిర్యాదు
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.
ఏలూరు: తప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వే కారణంగా మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన సర్వే పూర్తిగా తలకిందులవుతూ టీడీపి మట్టి కొట్టుకుపోయింది.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో తేల్చానని ఆయన పోలీసులను కోరారు.
మురళీకృష్ణ ఫిర్యాదుపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా లగడపాటి రాజగోపాల్ అంచనా తప్పిన విషయం తెలిసిందే.