ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని సీఎం జగన్ చెప్పారు.

గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంద‌న్నారు. శుక్రవారం రోజున తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి ఈ పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4,536 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..  దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని  చెప్పారు. అక్టోబర్-డిసెంబర్‌ మధ్య పెళ్లి చేసుకున్న వారు.. నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు. ఎవరూ మిస్‌ కాకుండా జనవరి చివరి దాకా అవకాశం కల్పించామని తెలిపారు. ఫిబ్రవరిలో వెరిఫీకేషన్‌ పూర్తి చేసి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు సహాయం చేస్తున్నామని చెప్పారు. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్దతిలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. 

పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. ‘‘ఈ కార్యక్రమంలో వయసు ఒక్కటే అర్హత కాకుండా, చదువు కూడా అర్హతగా నిర్దారించాం. ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నవారు చదువుకున్న వాళ్లు కాబట్టి వాళ్ల తరమే కాకుండా ఆ తరువాత తరం కూడా ఆటోమెటిక్‌గా చదువుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, డ్రాపౌట్స్‌ శాతాన్ని తగ్గించడం పద్ధతి ప్రకారం జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ అని సీఎం జగన్ తెలిపారు. 

గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు, దరఖాస్తు పూర్తి ఏర్పాట్లు.. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేదని సీఎం జగన్ చెప్పారు. గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారని.. కానీ అమలు ఘోరంగా ఉందని విమర్శించారు.