ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ లో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు (సోమవారం) ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్ లో పాల్గొన్న ఆయన ఏపీలో వైయస్ జగన్ కోవిడ్ నియంత్రణకు తీసుకున్నచర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో ఎలా బలోపేతం చేస్తుందని వివరించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తీరు తెన్నులను వెల్లడించారు.

కరోనా నియంత్రణ
ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా covid నియంత్రణ కార్యాచరణ అమలు చేశాం. ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ వంతున పనిచేశారు. 42 వేల మంది ఆశ వర్కర్లు ఇందులో పాలుపంచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించాం. ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మెడిసిన్స్ అందించాం. రోగులు అవసరమైన పౌష్టిక ఆహారం అందిస్తూ పకడ్బందీ ప్రణాళిక అమలు చేశాం. అందువల్లే కరోనా మరణాల రేటు ఏపీలో జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా.. దేశంలోనే అత్యల్పంగా 0.6 శాతంగా నమోదయ్యింది.

ఫ్యామిలీ డాక్టర్ తరహాలో…
ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. ఆ తర్వాత ఏమైనా రోగాలు వస్తే వాటికి సరైన సమయంలో వైద్యం అందించడం అనేది మరో కీలకమైన అంశం. ఈ రెండు అంశాలను బేస్ చేసుకుని ఏపీలోహెల్త్ కేర్ సిస్టంను రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా కలిగిన ఒక గ్రామంలో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పాం. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు.

ఈ పీహెచ్సీలకు అనుబంధంగా 104 అంబులెన్స్ లు ఉంటాయి. పీహెచ్సీల్లో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు అంబులెన్స్ ద్వారా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడతారు. వీరంతా ఆ గ్రామాల్లోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ లాగా మారుతున్నారు. పేరు పెట్టి పిలిచే సాహిత్యంతో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డాక్టర్లకు తెలుస్తోంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు వచ్చినా మొగ్గ దశలోనే దానికి చికిత్స అందించే వీలు ఉంటుంది.

వైద్య వ్యవస్థ బలోపేతం..
మండల స్థాయి దాటి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏరియా ఆస్పత్రిలో, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ హాస్పిటల్స్ చికిత్స అందిస్తాయి. ప్రతి పార్లమెంట్ యూనిట్గా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ కాలేజీలు వస్తాయి. అక్కడ పిజి స్టూడెంట్స్ ఉంటారు. వీళ్లంతా హెల్త్కేర్ లో భాగం అవుతారు. దీనిద్వారా హెల్త్కేర్ సిస్టం బలోపేతమవుతుంది.

మూడేళ్లలో..
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. మా ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే కొత్తగా 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లో ఒక యూనిట్గా మెడికల్ కాలేజీలు ఉండడంవల్ల అన్ని చోట్లా హెచ్చుతగ్గులు లేకుండా వైద్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇందుకోసం ఇప్పటికే 2 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాం. మూడేళ్లలో ఫలితాలు అందుతాయి. ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ నియంత్రణ కార్యాచరణ అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు.

కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్…
కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకం అమలు చేస్తోంది. ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. కానీ అంతకంటే మిన్నగా ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఇందులో ఏకంగా 2,446 అనారోగ్య సమస్యలకు చికిత్సలో అందిస్తున్నాం. ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన1.44 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. గత మూడేళ్లలో 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్య సహాయం అందించాలని సీఎం జగన్ వెల్లడించారు.