అవినీతి రహిత ప్రభుత్వం మాది... అమెరికా పర్యటనలో సీఎం జగన్
భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన జగన్ కి అక్కడ ఘనస్వాగతం లభించింది. పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని సీఎం అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాదు, పరిశ్రమలకు అవసరమైన భూములు, కరెంటు, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్డీసీలో యూఎస్ ఛాంబర్ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డీశాలినేషన్, మెట్రోరైళ్లు, బకింగ్హాం కాల్వ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉప్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతిలో అపార అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు.
నాణ్యత, అధిగ దిగబడులు సాధించడానికి తామ చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు. తాము ప్రాధాన్యతలుగా చెప్తున్న రంగాలన్నింటిలో పర్యావరణ హితం ఉంటుందన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు.
ఇటీవల ఎన్నికల్లో వైయస్.జగన్మోహన్రెడ్డి ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ బలమైన నాయకత్వం అమెరికా– ఆంధ్రప్రదేశ్ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలన్న భారత్ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యరంగాన్ని గాడిలోపెడుతున్నామని, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని పెద్ద ఎత్తున అభివృద్ధిచేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవవనరులను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.