సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్, చంద్రబాబు వేర్వేరుగా భేటీ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్, చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. శనివారం ఉదయం విజయవాడ నోవాటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ కలిశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్, చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. శనివారం ఉదయం విజయవాడ నోవాటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ రోజు ఉదయం విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన కోర్టు భవనాలు సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, అధికారులు పాల్గొననున్నారు.
ఇందుకోసం విజయవాడకు విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలస్తోంది. అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ ఎంపీ కనకమేడల, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అర్జునుడు కూడా సీజేఐను కలిశారు.
ఇదిలా ఉంటే.. కోర్టు భవనాల ప్రారంభం తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ నాగార్జున వర్సిటీ వెళ్లనున్నారు. నాగార్జున వర్సిటీలో గౌరవ డాక్టరేట్ను సీజేఐ అందుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ ఎన్వీ రమణ సీకే కన్వెన్షన్కు చేరుకోనున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో సీజేఐకు ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.