కేంద్రం తప్పుకున్నా... మేం వెనక్కి తగ్గలేదు: వైఎస్ జగన్
బియ్యం కార్డులున్న 1.41కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించే విధంగా మొత్తం రూ.510 కోట్ల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్ భీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
అమరావతి: వైయస్సార్ బీమా పథకాన్ని బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. బియ్యం కార్డులున్న 1.41కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించే విధంగా మొత్తం రూ.510 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోంది. కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం బ్యాంకర్లు, నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీకి వేర్వేరుగా మొత్తం రూ.510 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేశారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం యధావిధిగా:
ఏ ఒక్క కుటుంబం బాధ పడొద్దు: ఇది చాలా పెద్ద కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మాది. ఒక నిరుపేద కుటుంబం, సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం బాధ పడొద్దన్న ఉద్దేశంతో పథకం అమలు చేస్తున్నాం.
కేంద్రం తప్పుకున్నా..: గతంలో ఉన్నట్లుగా కాకుండా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ పథకం అమలు చేస్తోంది. ఏటా రూ.510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ కల్పిస్తోంది.
పారదర్శకంగా: పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించమని కోరాము. అర్హత ఉండి కూడా ఎవరి పేర్లు అయినా ఆ జాబితాలో లేకపోతే వారు తమ పేర్లు వెంటనే నమోదు చేసుకోవచ్చు.
బీమా ప్రయోజనాలు:
18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజ మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం
,18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ మరణించినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం.
ఇక 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.3 లక్షల సహాయం.
ఇంకా 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో: పథకంలో ప్రీమియమ్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. బ్యాంకర్లు ఆ నగదును తొలుత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, ఆ తర్వాత బీమా కంపెనీలకు ప్రీమియమ్గా చెల్లిస్తారు. ఆ తర్వాత ఒక వారంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేస్తారు. పథకం లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా గ్రామ, వార్డు సచివాలయాలు రెఫరల్ పాయింట్గా ఉంటాయి.
తక్షణమే రూ.10 వేలు: ఏదైనా ప్రమాదం జరిగి, కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్ పొందడానికి 15 రోజులు పడుతుంది. ఆలోగా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇస్తారు. ఇది పథకంలో లేకపోయినా, కొత్తగా అమలు చేయబోతున్నాము అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పంచాయితీరాజ్, కార్మిక ఉపాధి కల్పన శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకులు, నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.