స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు: స్పందించని అధికారిపై జగన్ వేటు
విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చిన పిటీషన్ పై అధికారి పట్టించుకోని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైయస్ జగన్ ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో ఎవరు అలసత్వం వహించిన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చిరించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్పందన కార్యక్రమం. స్పందన కార్యక్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సమస్యను పరిష్కరమయ్యేలా చూడాలని పదేపదే సూచిస్తున్నారు.
ఫిర్యాదుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కూడా పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఓ అధికారి జగన్ ఆదేశాలన బేఖాతార్ చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించినందుకు అతనిపై వేటు వేసింది ప్రభుత్వం.
వివారాల్లోకి వెళ్తే గత నెలలో విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి రేషన్ షాప్ ను డీలర్ కాకుండా బినామీ నిర్వహిస్తున్నాడని దానిపై చర్యలు తీసుకోవాలంటూ పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ ఫిర్యాదుపై పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయ భాస్కర్ ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ విషయం కాస్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. బుధవారం ఉదయం స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చిన పిటీషన్ పై అధికారి పట్టించుకోని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైయస్ జగన్ ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో ఎవరు అలసత్వం వహించిన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చిరించారు.
పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయభాస్కర్ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టి వరకు వెళ్లడంతో ఆయనపై వేటు వేశారు. ఉదయభాస్కర్ ను సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఉత్తర్వులు జారీ చేశారు.