ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రామాయపట్నం పోర్టుకు భూమి పూజ చేశారు. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రామాయపట్నం పోర్టుకు భూమి పూజ చేశారు. ఇందుకోసం ఈ రోజు ఉదయం సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం బయలుదేరారు. రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్‌కు అక్కడ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. తర్వాత సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్‌ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 

రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించనున్నట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. 

ఇక, నెల్లూరు పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా చీమకుర్తి, అద్దంకి, మార్టూరు ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి గ్రానైట్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో రామాయపట్నంలో ఓడరేవు కందుకూరు డివిజన్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి పొగాకు ఎగుమతులు కూడా రామాయపట్నం పోర్టుకు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కందుకూరు డివిజన్‌లోని వెనుకబడిన ప్రాంతాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఇతర ప్రాంతాలకు రామాయపట్నం ఓడరేవు ఒక గేమ్‌ఛేంజర్‌గా మారనుందని, పరిశ్రమల రాకను సులభతరం చేయడానికి ఏపీఐసీసీ భారీ ఎత్తున భూములను సేకరించాలని యోచిస్తోందని స్థానిక శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి అన్నారు.