ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఈరోజు కొత్తగా 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఈరోజు కొత్తగా 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లను సీఎం జగన్ పరిశీలించారు. ఇక, 2,50,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్‌ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం 34.79 కోట్లను ఖర్చు చేసి ఈ కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చింది. 

‘‘2019లో కేవలం 531 అంబులెన్స్‌లు సేవలో ఉన్నాయి. వాటిలో 336 అంబులెన్స్‌లు మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి జగన్ కొత్త అంబులెన్స్‌ల కొనుగోలు చేయాలని ఆదేశించారు. మేము 2020లో 412 కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చాం. 26 నవజాత శిశువుల అంబులెన్స్‌లతో కలిపి మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 748కి చేరుకుంది’’ అని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రాణాలను రక్షించే పరికరాలతో సహా అంబులెన్స్‌ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం దాదాపు 96.50 కోట్లను వెచ్చించింది.