గత అర్ధరాత్రి ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో పెళ్లిబృందం బస్సు ప్రమాదానికి గురైన దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్,  ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పందించారు. 

అమరావతి : పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురయి ఏడుగురు మృతిచెందిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ లు దిగ్బ్రాంతి వ్యక్తంచేసారు. ప్రకాశం జిల్లా దర్శి వద్ద దాదాపు 40మంది పెళ్ళి బృందంతో వెళుతున్న బస్సు అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందగా మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఈ ప్రమాదంపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేసారు. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. అధికారుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న జగన్ అన్నిశాఖల అధికారులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని జగన్ తెలిపారు. 

Read More ప్రకాశం జిల్లాలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు, ఏడుగురు మృతి

మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని చంద్రబాబు సూచించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వరుస రోడ్డుప్రమాదాలు ఆదోళన కలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. తాజాగా దర్శి వద్ద జరిగిన ప్రమాదం అయితే మాటలకందని విషాదమని... బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని సూచించారు.

ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. 'ప్రకాశం జిల్లా దర్శి వద్ద సాగర్ కాలువలో పెళ్లి బృందం బస్సు పడిపోయిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 12 మంది గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగింది. ఎంతో వేడుకగా పెళ్లి ముగించుకుని కాకినాడలో రిసెప్షన్ కోసం వెళుతున్న ముస్లిం కుటుంబాల సభ్యులు ఈ ప్రమాదంలో అశువులు బాయడం అత్యంత విచారకరం. గత అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం మానవ తప్పిదమా? లేక ఆర్టిసి బస్సు సాంకేతిక స్థితి సక్రమంగా లేదా అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసదుపాయం కల్పించడంతో పాటు మృతుల కుటుంబాలను ఆర్థికంగానూ ప్రభుత్వం సాయపడాలని కోరుతున్నాను' అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేసారు.