నరసరావుపేట వైసీపీలో వర్గపోరు : కాసు మహేశ్రెడ్డి అనుచరుల ఫ్లెక్సీలు.. శిలాఫలకం కూల్చేసిన ఎమ్మెల్యే వర్గీయులు
ఏపీలో అధికార వైసీపీలో నేతల మధ్య సఖ్యత కొరవడింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నేతలు విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నర్సరావుపేటకు కాసు రాక మాకెంతో ముఖ్యమంటూ కొటేషన్స్తో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాకుండా వేలాది కరపత్రాలను పంపిణీ చేశారు. ఇది పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కౌంటర్ అన్నట్లుగా లింగంగుట్లలో గతంలో కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా వున్నప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. దీంతో పేట వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. గురజాల ఎమ్మెల్యేగా వున్న కాసు మహేశ్ రెడ్డి... నర్సరావుపేట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్యేల అనుచర వర్గం తరచుగా ఫ్లెక్సీ వార్కు దిగుతోంది. ఇది ఎంత వరకు వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.