అనంతపురం క్లాక్ టవర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేసుకున్న సవాళ్లతో ఈ పరిస్థితి తలెత్తింది.
అనంతపురం క్లాక్ టవర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేసుకున్న సవాళ్లతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాలు.. సోషల్ మీడియాలో పరిటాల అభిమానులు, వైసీపీ శ్రేణుల మధ్య వార్ కొనసాగింది. తమ నేతే గొప్ప అంటే.. కాదు తమ నేతే గొప్ప అంటూ ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు దూషణలకు దిగారు. ఒకరి నేతపై మరొకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే దమ్ముంటే.. రాప్తాడు వెళ్లి మాట్లాడాలని టీడీపీ మద్దతుదారుడు సవాలు విసిరాడు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుదారుడు తాను అనంతపురంలోని క్లాక్ టవర్ వద్దకు వస్తున్నానని.. దమ్ముంటే అక్కడికి రావాలని ప్రతి సవాలు చేశాడు.
ఈ క్రమంలోనే అనంతపురం క్లాక్ టవర్ వద్దకు టీడీపీ, వైసీపీకి చెందిన మద్దతుదారులు చేరుకున్నారు. ఇరువర్గాలు వారి వారి నాయకులకు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుక ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ పోలీసుతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇక, ఇరువర్గాలకు చెందినవారికి అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. అయితే టీడీపీ శ్రేణులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
