చిత్తూరు ఎస్పీపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం...
చిత్తూరు జిల్లా ఎస్పీపై ఎంపీ శివప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక ఎంపీని మర్యాదపూర్వకంగా కలవాలన్న విషయం ఎస్పీకి తెలియకపోవడం ఆశ్యర్యంగా ఉందన్నారు.
చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ జిల్లా ఎస్సీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఎందుకంటే కొత్తగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పటేల్ మర్యదపూర్వకంగానైనా అతన్ని కలవక పోవడమే కారణం. ఈ విషయంపై ఇప్పటికే గుర్రుగా వున్న ఎంపీ ఓ కార్యక్రమంలో ఎస్పీ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంకేముంది ఎంపీ తపకు ఎస్పీపై వున్న కోపాన్నంత బైటపెట్టడమే కాకుండా ఆ కార్యక్రమం నుండి అలిగి వెళ్లిపోయారు.
చిత్తూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభోత్సవం ఎంపీ శివప్రసాద్ చేతులమీదుగా జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఎంపీ తో పాటు జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఎస్పీ రావడం ఆలస్యమైంది.
దీంతో అధికారులు ఎస్పీ వచ్చేవరకు కాస్త ఆగాల్సిందిగా శివప్రసాద్ ను సూచించారు. దీంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ అధికారి కోసం తాను ఎదురుచూడటం ఏంటని ప్రశ్నించాడు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎస్పీ వ్యవహార శైలి బాగోలేదని...మర్యాదపూర్వకంగానైనా స్థానిక ఎంపిని కలవడా అంటూ ఆగ్రహం ప్రదర్శించాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఎంపీ అక్కడి నుండి వెళ్లిపోయారు.