ప్రశ్నా పత్రాల లీకేజ్ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ భార్యను అదుపులోకి తీసుకోలేదన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ. నిందితుల వాంగ్మూలం ఆధారంగానే నారాయణను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కువ మార్కుల కోసం ఇలా మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారని చిత్తూరు ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ (ssc question paper leak) ఘటనకు సంబంధించి మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత నారాయణను (narayana) అరెస్ట్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్కు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి (chittoor district sp ) మీడియాకు వివరాలు తెలియజేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో నారాయణను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి చిత్తూరు వన్ టౌన్ పీఎస్లో నారాయణపై కేసు నమోదైందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రిషాంత్ రెడ్డి తెలిపారు.
గత నెల 27న టెన్త్ తెలుగు పేపర్ వాట్సాప్లో లీకైనట్లు కంప్లంట్ వచ్చిందని ఎస్పీ పేర్కొన్నారు. డీఈవో ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన చెప్పారు. అడ్మిషన్స్ పెంచడానికి ఇదంతా చేశారని ఎస్పీ తెలిపారు. లీకేజీ వ్యవహారం వెనుక నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్స్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ ఫోటోలు తీసి బయటికి పంపారని.. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కస్టడీలోకి తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. వాటికి సమాధానాలు రాసి మళ్లీ లోపలికి పంపించారని తెలిపారు.
ఎక్కువ మార్కుల కోసం ఇలా మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారని.. అడ్మిషన్స్ పెంచడానికి ఇదంతా చేశారని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిందితులంతా నారాయణ సంస్థ విద్యాసంస్థలేనని చెప్పారు. తిరుపతి డీన్ బాలగంగాధర్ను కూడా అరెస్ట్ చేశామని.. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఎవిడెన్స్తో ముందుకెళ్తామని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల వాంగ్మూలం ఆధారంగా ఆధారాలు లభ్యమయ్యాయని రిషాంత్ రెడ్డి చెప్పారు.
పేపర్ లీక్ చేసి వాట్సాప్లో సర్క్యూలేట్ చేశారని.. ఉద్దేశపూర్వకంగానే పేపర్ను లీక్ చేశారని ఎస్పీ వెల్లడించారు. వంద శాతం ఉత్తీర్ణత కోసం మాల్ ప్రాక్టీస్ చేశారని.. ఈ కేసులో నారాయణ భార్యను అదుపులోకి తీసుకోలేదని రిషాంత్ రెడ్డి తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణను అరెస్ట్ చేశామని.. ఏ విద్యార్ధులు ఎక్కడ పరీక్షలు రాస్తారో తెలుసుకుంటారని ఎస్పీ చెప్పారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
