Chandrababu with NDA Leaders: ఏపీలోని విశాఖపట్టణాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చుదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలకు పిలుపునిచ్చారు.
సోమవారం నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. రాజధాని సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా నేతలు బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఇది అందరి రాజధాని అని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అని చంద్రబాబు అన్నారు. ఇక అమరావతితోపాటు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు బాధ్యత తీసుకొని వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో త్వరలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతామన్నారు చంద్రబాబు.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడతామని సీఎం తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి చేసి వన్ ఫ్యామిలీ... వన్ ఎంట్రప్రెన్యూర్ సాకారం దిశగా అడుగులు వేస్తామన్నారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. ఎరైన్-కో రామాయపట్నంలో, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీలు లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాయి. మిట్టల్ ప్లాంట్ పూర్తయితే రెండు స్టీల్ ప్లాంట్లు, దేశంలోనే ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేసే జిల్లాగా ఉమ్మడి విశాఖ రికార్డు సృష్టిస్తుంది.
రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. రాయలసీమకు బెంగళూరు, హైదరాబాద్ అనుసంధాన హైవేలు, ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉంటాయి. తద్వారా లాజిస్టిక్ హబ్గా రాయలసీమ మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. టెలీకాన్ఫరెన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.