ఎన్టీఆర్ నేర్పిందే.. బీజేపీపై అమలు చేద్దాం.. చంద్రబాబు
పార్టీ మనకు ఏం చేసింది అని ఆలోచించే సమయం కాదని.. పార్టీ కోసం మనం ఏమి చేశాం అని ఆలోచించే సమయం ఆసన్నమైందని ఆయన నేతలకు సూచించారు.
ఏపీలో ఎన్నికలు ప్రారంభం కావడానికి కేవలం 100రోజుల గడవు మాత్రమే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ మనకు ఏం చేసింది అని ఆలోచించే సమయం కాదని.. పార్టీ కోసం మనం ఏమి చేశాం అని ఆలోచించే సమయం ఆసన్నమైందని ఆయన నేతలకు సూచించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. నిరంకుశత్వాన్ని ఎదురించడమే ఎన్టీఆర్ తమకు నేర్పించారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ నిరంకుశత్వం బీజేపీ రూపంలో,.. పెత్తందారీతనం నరేంద్రమోదీ రూపంలో మన ముందు ఉందన్నారు. అందుకే బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు.
రేపు కోల్ కత్తాలో బీజేపీయేతర పార్టీలన్నీ ర్యాలీ చేపడుతున్నాయన్నారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్, వైసీపీ తప్ప మిగితా అన్ని పార్టీలు పాల్గొంటున్నాయన్నారు. దీనిని బట్టే ఆ రెండు పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తున్నాయో తెలిసిపోతోందన్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ అనుకూలక కూటమి, వ్యతిరేక కూటమి ఈ రెండు మాత్రమే ఉన్నయన్నారు.టీఆర్ఎస్, వైసీపీ మోదీ అనుకూల కూటమిలో ఉన్నాయని పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేసేందుకే బీజేపీ కడపలో సభ ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు.