మీరు తీసుకొన్న గోతిలో మీరే పడతారు: వైసీపీపై చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు విషయమై అధికార, విపక్షాల మధ్య బుధవారం నాడు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయమై అధికార, విపక్షాల మధ్య బుధవారం నాడు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. పోలవరంపై చర్చను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ ప్రారంభించారు. ఆ తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రసంగించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం విషయంలో తమ ప్రభుత్వం హయంలో తీసుకొన్న నిర్ణయాలను చంద్రబాబు వివరించారు.
also read:పోలవరం ప్రాజెక్టును వివాదంలోకి లాగుతున్నారు: బాబు, కౌంటరిచ్చిన మంత్రి అనిల్
ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.పోలవరం విషయంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. మీరు తీసుకొన్న గోతిలో మీరే పడతారని చంద్రబాబు వైసీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
ఆ తర్వాత పోలవరం ఎమ్మెల్యే ఇదే అంశంపై మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనలు సాగుతున్న సమయంలోనే ఏపీ సీఎం జగన్ పోలవరంపై సమాధానం చెప్పారు.