ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితభూముల్లో మట్టి తవ్వకాలు, దాడులను లేఖలో ప్రస్తావించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితభూముల్లో మట్టి తవ్వకాలు, దాడులను లేఖలో ప్రస్తావించారు. చించినాడలో దళితులపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో వైసీపీ నేతలే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ప్రశ్నించిన దళితులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.
చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తమ అనుచరుల ద్వారా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీన దళితులు నిరసనకు దిగితే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని.. దాడిలో గాయపడిన వారికి వెంటనే వైద్యం చేయించకపోగా... వారిని కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. పోలీసులు వారిని పక్కనున్న పాలకొల్లు ఆసుపత్రికి తీసుకుపోకుండా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారని విమర్శించారు. బాధితుల నుంచి వాంగ్మూలం కూడా తీసుకోలేదని చెప్పారు.
అక్రమ తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనలో నిందితులను రక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని లేఖలో చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి నది ఒడ్డున విచక్షణారహితంగా మట్టిని తవ్వడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల నదిగట్టు ధ్వంసమైందని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తుందని అన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలను నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
