అలాగయిలే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం... జాగ్రత్త: చంద్రబాబు హెచ్చరిక
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంవత్సర కాలంలో కేవలం జె-టర్న్ తీసుకోవడం తప్ప ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదన్నారు. రాజకీయాల్లో ప్రజల నమ్మకమే ముఖ్యమని.. దాన్ని కోల్పోయి చరిత్ర హీనుల్లా మిగలవద్దని వైసిపి నాయకులను హెచ్చరించారు.
''ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. ప్రజల్లో మన పట్ల ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలి. లేదంటే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం. ఇది వైసీపీ పాలకులు గ్రహించాలి'' అంటూ సోషల్ మీడియా వేదికన చురకలు అంటించారు.
''ప్రజలు మీ మాటలు నమ్మి మీ నాయకత్వాన్ని అంగీకరించినప్పుడు, హామీలపై 'జె-టర్న్' తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే మీ నోట వచ్చిన విశ్వసనీయత అనేది ఎక్కడున్నట్టు? ఏడాది కాలంగా రద్దులు, జె-టర్న్ లు తప్ప మీరు చేసిందేంటి?'' అని ఎద్దేవా చేశారు.
read more ఒక్కసారి వైసిసి గేట్లెత్తి చూడండి... రివర్స్ జంపింగ్ లు ఖాయం: బుద్దా సంచలనం
''సన్న బియ్యంపై, కాళేశ్వరంపై, 45 ఏళ్లకే పింఛన్ పై, ఉద్యోగుల సిపిఎస్ పై, కరెంట్ చార్జీలపై, రైతులకు రూ 3 వేల కోట్ల స్థిరీకరణ నిధిపై, యువత ఉపాధిపై..ఇలా అన్నింటిలోనూ మీరు తీసుకున్న జె-టర్న్ లతో రాష్ట్రం కూడా రివర్స్ లో తిరోగమనం పట్టింది'' అన్నారు.
''ప్రత్యేక హోదా నుంచి అమరావతి వరకు మీరెన్ని చెప్పారు? ఇప్పుడు చేస్తున్నది ఏంటి? అమలులో ఉన్న పది పాత పథకాలను రద్దుచేసి ఆ డబ్బుతో ఒక్క పథకం అమలు చేస్తామనడం మోసం. ఇకనైనా మాటమీద నిలబడి పాలన చేయండి'' అని వైసిపి ప్రభుత్వాన్ని చంద్రబాబు సూచించారు.