నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి బయపడిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.

అమరావతి: నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి బయపడిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా.. ఈ ఘటనకు సంబంధించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారంతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యక్రమాల్లోకి చొరబడి ఘర్షణలకు పురిగొలిపే ఘటనలు ఉంటున్నాయని.. అలాంటి వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

ఇదిలా ఉంటే.. నారా లోకేష్ పాదయాత్ర మంగళవారం రాత్రి నంద్యాల నియోజకవర్గంలోని చేరుకుంది. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్నాయి. అదే కొత్తపల్లి వద్దకు లోకేష్ పాదయాత్ర చేరుకున్న సమయంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. అఖిలప్రియ వర్గీయుల దాడిలో ఏపీ సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. సుబ్బారెడ్డి కారులో ఎక్కించి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో అఖిలప్రియ అక్కడే ఉన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం ఉదయం అఖిలప్రియను అరెస్ట్ చేశారు.