చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ నిరసనలు.. పలుచోట్ల అరెస్ట్లు.. ఉద్రిక్త పరిస్థితులు..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. శనివారం ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేశారనే వార్త తెలిసినప్పటీ నుంచి టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. శనివారం ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేశారనే వార్త తెలిసినప్పటీ నుంచి టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును శనివారం నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్న మార్గంలో కూడా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ నిరనసలను టీడీపీ శ్రేణులు ఆదివారం మరింత ఉధృతం చేశారు.
మరోవైపు టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతల హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తన ఇంటివద్దే మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. సీఎం వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్కు పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శలు చేశారు.
మరోవైపు ప్రస్తుతం విజయవాడ కోర్టు కాంప్లెక్స్లోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు కోర్టువద్ద భారీ భద్రత ఏర్పాటుచేసారు. టీడీపీ చెందిన నేతలు, కార్యకర్తలు అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నానిలోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఇక, చంద్రబాబు అరెస్టుకు నిరసగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో టీడీపీ నేతలు నిరహారదీక్షకు దిగగా.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. కృష్ణా జిల్లా పామర్రులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వర్లకుమార్ రాజా ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి మండలం మైదు గోళంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంజునాథ్ అనే కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. దీంతో పోలీసులు ఎలాగోలా మంజునాథ్ను కిందకు వచ్చేలా చేసి.. తర్వాత అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పూతలపట్టు నియోజకవర్గంలో కూడా టీడీపీ శ్రేణులు నిరాహారదీక్షకు దిగారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలోనే నిరసనకారులను వదిలేసారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనలు యధావిధిగా కొనసాగుతున్నాయి.