చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ: షరీఫ్ లేదా ఫరూఖ్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పిస్తానని ఆయన ఇటీవల చెప్పారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పిస్తానని ఆయన ఇటీవల చెప్పారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 28వ తేదీ లోపల ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. ఆ రెండు ఖాళీలను భర్తీ చేస్తారా, ఒక్కరికే అవకాశం కల్పిస్తారా అనేది తెలియడం లేదు.
ఈ నెల 28వ తేదీన గుంటూరు మైనారిటీల సదస్సు ఉంది. దాంతో ఈలోగానే ఆయన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం సాగుతోంది. షరీఫ్ కు గానీ ఫరూక్ కు గానీ చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు.
అయితే, తెలుగుదేశం పార్టీ సీనియర్లు మాత్రం ఫరూక్ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే ఇద్దరికి కూడా అవకాశం కల్పించే ఆలోచన కూడా చంద్రబాబు చేయవచ్చునని అంటున్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ విస్తరణను చేపడుతారని అంటున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకున్న ఆయన మైనారిటీలకు గాలం వేసేందుకు ముస్లింకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.