Nara Bhuvaneswari : నా ప్రార్థనను దేవుడు విన్నాడు..: తిరుమల వెంకన్న సన్నిధిలో భువనేశ్వరి భావోద్వేగం
ఇటీవల భర్త చంద్రబాబు నాయుడు లేకుండానే తిరుమలకు వచ్చి స్వామివారికి గోడు చెప్పుకున్నానని... అది ఆయన విన్నారని భువనేశ్వరి అన్నారు. స్వామి ఆశిస్సులతోనే ఇప్పుడిలా భర్తతో కలిసి తిరుమలకు వచ్చినట్లు నారా భువనేశ్వరి ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
![Chandrababu Couple Visited Tirumala Temple ... Nara Bhuvaneshwari emotional words AKP Chandrababu Couple Visited Tirumala Temple ... Nara Bhuvaneshwari emotional words AKP](https://static-ai.asianetnews.com/images/01hgj3nf0e4rrt2v5eq9dpvdmk/download--84--png_363x203xt.jpg)
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సతీసమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు. అనారోగ్య కారణాలతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన చంద్రబాబు వైద్యం కోసం నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇలా దాదాపు రెండునెలలకు పైగా రాజకీయాలకు దూరమైన ఆయన ఇవాళ మొదటిసారి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం నిన్ననే హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు భార్య భువనేశ్వరితో కలిసి చేరుకున్నారు చంద్రబాబు. శుక్రవారం ఉదయం చంద్రబాబు దంపతులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.
ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారి భర్త లేకుండానే తిరుమలకు ఒంటరిగానే వచ్చానని భువనేశ్వరి గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన ప్రార్థనను దేవుడు ఆలకించాడని... అందువల్లే ఇప్పుడిలా భర్తతో కలిసి రాగలిగానని అన్నారు. స్వామివారు కృప తమపై వుండటం సంతోషంగా వుందన్నారు. ఇవాళ మరోసారి స్వామి ఆశిస్సులు పొందగలిగానని భువనేశ్వరి అన్నారు. ఇలా భర్తతో కలిసి తిరుమలలో వున్న ఫోటోలను జతచేస్తూ ఎక్స్ వేదికన భావోద్వేగభరిత కామెంట్స్ చేసారు భువనేశ్వరి.
చంద్రబాబు కూడా స్వామి దర్శనం అనంతరం మాట్లాడుతూ... 2003 లో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుండి ఆ వేంకటేశ్వర స్వామే కాపాడారని అన్నారు. మావోయిస్టులు తనను చంపేందుకు ప్రయత్నిస్తే స్వామియే ప్రాణబిక్ష పెట్టారని అన్నారు. ఇటీవల కూడా కష్టకాలంలో వున్న తాను తిరుమల వెంకనన్న ప్రార్థించానని అన్నారు. స్వామివారి ఆశిస్సులతోనే కష్టాల నుండి బయటపడ్డానని... అందుకే ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టగానే తిరుమలకు విచ్చేసానని తెలిపారు. స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నానని చంద్రబాబు తెలిపారు.
Read More Nara Chandrababu Naidu:తిరుమల వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు
ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రాజకీయాల్లో మళ్లి యాక్టివ్ అవుతానని... రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకువెళతానని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.