ఏపీ బిజెపి తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తోంది. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చలో అమరావతికి పిలుపునిచ్చారు. దీంతో బిజెపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం అమలాపురం చేరుకోవడానికి సిద్ధపడ్డారు. వారిని పోలీసుుల ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
బిజెపి నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడులో బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరిని హౌస్ అరెస్టు చేశారు. ఛలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధపడడంతో ఆమెను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్ బాబును హనుమాన్ జంక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోలీసు స్టేషన్ కు తరలించారు. తాడేపల్లిలోని సోము వీర్రాజు నివాసానికి పెద్ద యెత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. వీర్రాజును హౌస్ అరెస్టు చేయడంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్యకర్తలు నినాదాలు చేశారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం నుంచి తమ వాహనంలో విష్ణువర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.
