ఏపీకి ప్రత్యేక హోదాపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న.. కేంద్రం సమాధానం ఏమిటంటే..
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరి కలిగిన రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. ఇక, 14వ ఆర్థిక సంవత్సరం సిఫార్సుల ప్రకారం.. 2015-20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21, 2021-26 కాలానికి ఇది 41 శాతంగా (జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు కారణంగా 1 శాతం సద్దుబాటు చేయబడింది) ఉండాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పన్నుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రం వనరుల అంతరాన్ని సాధ్యమైనంత వరకు పూరించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
డెవల్యూషన్ మాత్రమే అంచన వేసిన అంతరాన్ని పూడ్చలేని రాష్ట్రాలకు పోస్టు డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్లు అందించబడ్డాయని తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కేంద్రం, రాష్ట్రం మధ్య 90:10 నిష్పత్తిలో పంచుకున్నట్లయితే.. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్రం పొందగలిగే అదనపు కేంద్ర వాటాను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయం (special assistance) అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.
ఏపీ 2015-16 నుంచి 2019-20 వరకు సంతకం చేసి, పంపిణీ చేసిన ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ల (ఈఏపీ) కోసం రుణం, వడ్డీని తిరిగి చెల్లించడం ద్వారా ప్రత్యేక సహాయం అందించబడుతుందని అన్నారు.