ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై రాజ్యసభలో కేంద్ర విద్యుత్‌ మంత్రి కీలక ప్రకటన చేశారు. విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర విభజన అనంతరం.. తెలంగాణ ప్రభుత్వం ఆరు వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను ఆంధ్రప్రభుత్వానికి బకాయిపడింది. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ ప్రకటించారు. తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను రిజర్వ్‌ బ్యాంక్‌ ద్వారా జమ చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఒక రాష్ట్రం... మరో రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలను రిజర్వ్‌ బ్యాంకు ద్వారా జమ చేయించవచ్చని, ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ తన అభిప్రాయాన్ని కేంద్రానికి చెప్పిందని కేంద్ర మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, తదానుగుణంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. 

ఏపీకి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఏళ్ళ తరబడి జాప్యం చేస్తూ వస్తోందనే విమర్శలున్నాయి. విద్యుత్‌ చార్జీల బకాయిల చెల్లించేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం పలు మార్లు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఏపీకి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని గత ఏడాది తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. అయినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.