Asianet News TeluguAsianet News Telugu

భారీ ట్విస్ట్: డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ కేసు నమోదు

విశాఖపట్నంలో నడిరోడ్డుపై హంగామా చేసిన డాక్టర్ సుధాకర్ మీద సీబీఐ కేసు నమోదు చేసింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీబీఐ అధికారులు పోలీసు అధికారులను విచారించారు.

CBI files case against Dr Sudhakar for violating lockdown
Author
Visakhapatnam, First Published Jun 3, 2020, 6:50 AM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి చెప్పారు. మంగళవారం రాత్రి సుధాకర్ మీద 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. 

కేసు వివరాలను తమ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. విశాఖపట్నంలో నడిరోడ్డుపై ఆందోళనకు దిగిన సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించిన పరిణామాలపై  టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖను, పంపించిన వీడియోను సుమోటో పిల్ గా పరిగణించి హైకోర్టు కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.

Also Read: ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్ 

ఇదిలావుంటే, ట్రాఫిక్ కు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణపై డాక్టర్ సుధాకర్ మీద కేసు నమోదు చేశామని, అయితే ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని విశాఖపట్నం ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ తెలిపారు. ఘటన జరిగినప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ అనే విషయం పోలీసులకు తెలియదని ఎసీపీ చెప్పారు. 

మద్యం సేవించిన వ్యక్తి అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లారని, వారిపై సుధాకర్ తిరగబడ్డారని ఆయన చెప్పారు. అంతేకాకుుండా పోలీసులనే కాకుండా ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రిని దుర్భాషలాడారని, బెదిరించారని ఆయన వివరించారు. హోంగార్డు చేతిలోని సెల్ ఫోన్ ను ధ్వంసం చేశారని, తనను గాయపరుచుకున్నాడని ఆయన వివరిం్చారు. దాంతో నాలుగో పట్టణం పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని చెప్పారు. 

Also Read: దళిత మేధావి సుధాకర్ ను పిచ్చోడిలా చిత్రీకరిస్తున్నారు: కాల్వ

ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించడంతో నిర్దారణ కోసం కేజీహెచ్ కు పంపించామని, అక్కడి వైద్యుల సలహాల మేరకు మానసిక వైద్యశాలకు పంపించామని ఎసీపీ చెప్పారు. అంతకు మించి తమకు ఈ వ్యవహారంలో ఏ విధమైన సంబంధం లేదని కులశేఖర్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios