కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని ముద్రగడ్డ ప్రశ్నిస్తున్న తీరు అనుమానంగా ఉంది.. బుద్దా వెంకన్న లేఖాస్త్రం
కాపు నేత ముద్రగడ పద్మనాభంకు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని ముద్రగడ్డ ప్రశ్నిస్తున్న తీరు అనుమానంగా ఉందని అన్నారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభంకు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ముద్రగడ లేఖ రాయగా.. అందుకు కౌంటర్గా బుద్దా వెంకన్న ఈ లేఖను రాసినట్టుగా తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం కాపులకు ఏం చేయకపోయినా ముద్రగడ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. జగన్తో ముద్రగడ లాలాచీపడ్డారా? లేక భయపడ్డారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శిస్తే బీసీలుగా తాము చూస్తూ ఊరుకోమని చెప్పారు.
కాపులకు జగన్ ఏం చేశారనేది వివరించిన తర్వాత ముద్రగడ ఇతరులను ప్రశ్నించాలని అన్నారు. కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని ముద్రగడ్డ ప్రశ్నిస్తున్న తీరు అనుమానంగా ఉందని అన్నారు. ఇకపై ముద్రగడ ప్రతి లేఖపై స్పందిస్తామని చెప్పారు. స్వార్ద రాజకీయాల కోసం కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకోవద్దని ముద్రగడను కోరారు.
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్కు రాసిన లేఖలో ముద్రగడ పలు విమర్శలు చేశారు. ఈ లేఖతో పవన్కు కోపం రావచ్చని.. ఆయన కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చని కూడా పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే తాను లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు. చంద్రబాబు నాయుడు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించాని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్.. కాపు రిజర్వేషను అంశం తన చేతిలో ఉండదని కేంద్రం పరిధిలోనిది అని చెప్పినప్పుడు.. తాను ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసుకోవాలని పవన్కు సూచించారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరు ఎందుకు అందించలేదో సమాధానం చెప్పాలని పవన్ను ప్రశ్నించారు.
ఎమ్మెల్యేను తిట్టడానికి మీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని.. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం నుంచి కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంటు వగైరా సమస్యల గురించి మాట్లాడాలని కోరారు. 2019 ఎన్నికల ముందు పవన్ తన వద్దకు పంపించిన రాయబారులకు సలహా ఇచ్చి పంపించానని.. కానీ ఆ సలహాలు అడిగి గాలికి వదిలేసారని విమర్శించారు. నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వాటిపై యుద్దం చేయాలని పవన్ను లేఖలో కోరారు. పార్టీకి అధినేతగా ఉన్న పవన్ వీధి రౌడి భాషలో మాట్లాడటం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. రాజకీయాలలో సామాన్యుడి ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కోవాలని అన్నారు. అయితే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉంటారని అన్నారు.