నందిగామలో సౌమ్య అవినీతిపై పోరాటం చేస్తుంది.. కేశినేని వ్యాఖ్యలపై స్పందించను: బుద్దా వెంకన్న
తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై తాను స్పందించని అన్నారు. అయితే గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు.
తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై తాను స్పందించని అన్నారు. అయితే గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. నందిగామలో తంగిరాల సౌమ్య ప్రజల కోసం.. ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాటం చేస్తుందని అన్నారు. గతంలో సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్న.. ఆమెపై అవినీతి మచ్చ లేదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే మెండితోక జగన్మోహన్ రావు బ్రదర్స్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వయసును కూడా లెక్క చేయకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ ప్రాణాలు పట్టించుకోకుండా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదన్నారు. పార్టీకి నష్టం కల్గించేలా ఎటువంటి వ్యాఖ్యలు తాను చేయబోనని చెప్పారు.
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రధారి, ముఖ్యమంత్రి జగన్ సూత్రధారి అని ఆరోపించారు. దైవం లాంటి కన్నతల్లిని అడ్డం పెట్టుకుని అవినాశ్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులకు ఏపీ పోలీసులు సహకరించకపోవడం దారుణమని అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులను తీసుకొచ్చయినా సరే అవినాశ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.