తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటరిచ్చారు. నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదని.. నువ్వేంది, నీ స్థాయి ఏంటీ అంటూ వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటరిచ్చారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా మనవళ్లపై ఒట్టేసి చెబుతున్నా.. చంద్రబాబు నాతో తిట్టించలేదన్నారు. కేశినేని నానిని తిట్టాలని చంద్రబాబు నన్ను ఆదేశించలేదని వెంకన్న తెలిపారు. కేశినేని నానికి, కేశినేని చిన్నికి ముందు నుంచే గొడవలున్నాయని .. చిన్నిపై పెట్టిన కేసులను చంద్రబాబు పెట్టమన్నారా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. సొంత తమ్ముడి భార్యపై ఎవరైనా కేసులు పెడతారా అని ఆయన నిలదీశారు.
నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదని.. నువ్వేంది, నీ స్థాయి ఏంటీ అంటూ వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ ఆయన మండిపడ్డారు. అసలు బుద్ధా వెంకన్నతో చంద్రబాబు మాట్లాడించాలా.. కేశినేని వైసీపీ కోవర్టు అని ఆరోపించారు. నువ్వు సొంతంగా గెలిచావా, ఈసారి నువ్వు గెలిస్తే బుద్ధా భవన్ ఇచ్చేస్తా.. నేను గెలిస్తే కేశినేని భవన్ ఇస్తావా అని వెంకన్న సవాల్ విసిరారు.
నువ్వు నిజాయితీపరుడివా .. విజయవాడకు కాపలాదారుడివా అని ఆయన ప్రశ్నించారు. బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా.. నీది సక్రమార్జనా అంటూ ఫైర్ అయ్యారు. నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు మోసగాడా .. టీడీపీ జెండా పక్కనపడేస్తే నీకు, నాకూ విలువ వుండదన్నారు. టీడీపీ జెండా భుజాన వున్నంత వరకే మనకు విలువ అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. కేశినేని నాని.. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. శ్వేతను చంద్రబాబు పోటీ చేయమనలేదని.. ఆమె పేరును నాని సొంతంగా ప్రకటించుకున్నారని వెంకన్న తెలిపారు.
కేశినేని నాని ఎక్కడ ఖర్చు చేశారని.. చంద్రబాబు నిన్నెందుకు పిలవాలని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. నీకు ప్రోటోకాల్ ఎవరిచ్చారు .. కొడాలి నాని , వల్లభనేని వంశీ అన్నేసి మాటలంటుంటే, టీడీపీలో వుంటూ ఒక్కరోజైనా ఖండించావా అని ఆయన నిలదీశారు. క్యారెక్టర్లెస్ కేశినేని ఏదేదో మాట్లాడాడని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.
