Thota Chandrasekhar| వైసీపీ సర్కారు వైఫల్యాలు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు.
Thota Chandrasekhar| ఏపీలో మద్యం,గంజాయి విచ్చలవిడిగా లభ్యమౌతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, జగన్ నాయకత్వంలోని వైకాపా సర్కార్ సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం నాడు గురజాల ,విజయవాడ నియోజకవర్గాలకు చెందిన తెల్లపోగు ఆదాం, ఉమామహేశ్వరరావు, నాగేళ్ల కోటేశ్వరరావు, ఎం.బి.చంద్రపాల్ సహా పలు జిల్లాలకు చెందిన నేతలు తోట సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి యువతకు ఉపాధి హామీలు కల్పించక వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో ప్రజల్ని నయవంచన చేస్తూ రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్, ప్రభుత్య ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ స్తితి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ రాక్షస పాలనలో అన్నీ రంగాలు నిర్వీర్యమైయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రత్యామ్న్యయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 2022 నాటికి పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తామని నాడు సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వైసీపీ సర్కారును రానున్న కాలంలో గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
