మెడకు ఉరి పడి బాలుడి మృతి: బాలిక గొంతు కోసిన ప్రేమోన్మాది
విశాఖపట్నం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసకుంది. మెడకు ఉరి పడి ఓ బాలుడు మరణించాడు. ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ దాడి చేశాడు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్కవరపుకోట మండలం పోతంపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 12 సంత్సరాల బాలుడు లంక ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని మెడకు ఉరి పడి మృతి చెందాడు. దేవాడ గ్రామంలో ఉన్న అమరావతి స్కూల్లో అతను అరవతరగతి చదువుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు బాలుని పరీక్షించి అతని మృతిని నిర్ధారించారు.
తల్లి పొలం పనులు వెళ్లగా ఇంటిలో ఒక్కడు ఆడుకుంటున్నాడని, కొంత సమయం తరువాత మృతుని అక్క ఇంటికి వెళ్లి చూడగా మంచానికి ఉన్న పట్టి తో ఉరిపడి ఉన్నాడని, వెంటనే తమ బంధువులను పిలువగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని మృతుని బంధువులు తెలుపుతున్నారు.లక్కవరపుకోట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని పెదమడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామంలో ఓ ఆటో డ్రైవర్ పదో తరగతి బాలిక మెడ కోశాడు.
ప్రేమిస్తున్నానంటూ అతను కొంత కాలంగా బాలిక వెంట పడుతున్నాడు. అయితే, బాలిక అందుకు నిరాకరించడంతో అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.