వైసీపీ గెలుపు.. విజయనగరం నుంచే మొదలౌతుంది.. బొత్స
చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనకబడిందని.. అత్యాచారాలలో మాత్రం బిహార్ను మించిపోయిందని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ పాదయాత్ర ఈ నెల 24వ తేదీ నాటికి దేశపాత్రుని పాలెం గ్రామానికి చేరుకొనే సరికి మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా ఆ గ్రామంలో పైలాన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పైలాన్ ఏర్పాట్లను బొత్స సత్యనారాయణ ఈ రోజు పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నాడు మహానేత వైఎస్సార్ ప్రజాప్రస్థానం నిర్వహిస్తే నేడు ఆయన తనయుడు అంతే నిబద్ధతతో ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 11 జిల్లాలో పూర్తై 12 జిల్లాలో అడుగుపెడుతున్న ప్రజాసంకల్పయాత్రను గొప్ప చారిత్రత్మాక విజయంగా బొత్స వర్ణించారు. జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని.. ప్రతి జిల్లాలో అశేష జనవాహిని ఆయన వెంట కదలి వస్తోందని తెలిపారు.
ఈ సారి ఎన్నికల్లో వైసీపీ నే విజయం సాధిస్తుందని.. విజయం నగరం జిల్లా నుంచే విజయం ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనకబడిందని.. అత్యాచారాలలో మాత్రం బిహార్ను మించిపోయిందని ఆరోపించారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల, సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తానన్నారు.. కానీ ఇంతవరకూ ఒక్కసారి కూడా వాటి ప్రస్తావన కూడా తేలేదని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లాలో ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా అని బొత్స ప్రశ్నించారు. కమిషన్ల కోసమే భోగాపురం ఎయిర్పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. పోలవరంలో జరిగిన అవినీతి గురించి కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని తెలిపారు. అవినీతి జరిగింది నిజమే కాబట్టి కాగ్ నివేదిక మీద ఇంతవరకూ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదన్నారు.