నేవీ దెబ్బకు జగన్ సర్కార్ సైలెంట్ అయింది: విశాఖపై బోండా ఉమా
విశాఖలోని మిలీనియం టవర్స్ లో సచివాలయం పెట్టవద్దని నేవీ అధికారులు లేఖ రాశారని, దాంతో జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు అన్నారు.
అమరావతి: విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో సచివాలయం పెట్టవద్దని నేవీ అధికారులు చెప్పారని, నేవీ అధికారుల దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయిందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. విశాఖ రాజధాని అన్నవాళ్లు ఇప్పుడేం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
విశాఖ మిలీనియం టవర్స్ లో సచివాలయం పెట్టవద్దని నేవీ లేఖ రాసిందని, దానికి జగన్ కూడా అంగీకరించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఏ తప్పు కూడా చేయలేదని, తాము ఏ విధమైన విచారణకైనా సిద్ధమేనని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ 9 నెలల పాలనపై సిట్ విచారణకు సిద్దమా అని బోండా ఉమా వైసీపీని ప్రశ్నించారు. విశాఖ భూములు, ఇసుక, మద్యం అమ్మకాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు అధికారులతో సిట్ ఎలా వేస్తారని ఆయన అడిగారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన క్విడ్ ప్రోకోలో అధికారులు జైలుకు వెళ్లారని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అలాంటి తప్పులు జరగలేదని ఆయన అన్నారు. జనగ్ వేసే ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. అసమర్థ సీఎం జగన్ ఎపీని సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం చేతకాదని బోండా ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ చేసిందేమీ లేదని అన్నారు.
నిమ్మగడ్డ సెర్బియా జైలులో ఉన్నారని, దానిపై ఎందుకు జగన్ మాట్లాడడం లేదని అన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ఏం మాట్లాడారో సీఎం జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతిపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేశామని, అయితే జగన్ ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసిందని ఆయన అన్నారు.