ఆ ప్రచారంలో నిజం లేదు.. గంటా శ్రీనివాసరావుతో భేటీపై బొండా ఉమా
విజయవాడలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమా, యడం బాలాజీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమా, యడం బాలాజీ సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికి వర్గానికి చెందిన నేతలు ఇలా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే తన నివాసంలో జరిగిన భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని గంటా శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. మరోవైపు బొండా ఉమా కూడా ఇదే రకమైన సమాధానం చెప్పారు.
కొన్ని మీడియా చానల్స్ స్నేహపూర్వకంగా జరిగి సమావేశాన్ని వక్రీకరిస్తున్నాయని బొండా ఉమా అన్నారు. ఆ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా మాత్రమే తాము కలిశామన్నారు. కుటుంబ వ్యవహారాలు, యోగ క్షేమాల గురించి ఈ సందర్భంగా మాట్లాడుకున్నామని చెప్పారు. వైజాగ్లో కాపునాడు సమావేశంపై ఎటువంటి చర్చ జరగలేదని చెప్పారు. వైజాగ్లో రంగా వర్ధంతికి సంబంధించిన పోస్టర్లను మాత్రమే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారన్నారు. పార్టీ మారే అంశంపై వస్తున్న వార్తలను గతంలోనే గంటా ఖండించారని అన్నారు.
కాపు నాడు అనేది ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదని... అందిరితో కూడుకున్న అంశమన్నారు. ఈ 26వ తేదీన రంగా వర్ధంతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నామని.. కాపు నాడు సభ మాత్రం కాదన్నారు. కాపులకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు.