Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం: కెమిస్ట్ శ్రీనివాస్ గల్లంతు, ట్యాంకర్లు పేలి...

విశాఖపట్నంలోని సాల్వెంట్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత కెమిస్ట్ కె. శ్రీనివాస్ కనిపించుకుండా పోయాడు.

Blast at Solvent pharma company at Visakhapatnam: Srinivas not found
Author
Visakhapatnam, First Published Jul 14, 2020, 7:57 AM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల సాల్వెంట్ ఫార్మా కంపెనీలో జరిగిన భారీ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత కెమిస్ట్ కె. శ్రీనివాస్ ఆచూకీ లేకుండా పోయారు. 

శ్రీనివాస్ గల్లంతుపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ను ఆచూకీ కనిపెట్టాలని వారు ఆర్డీవో కిశోర్ ను కోరారు. అయితే, శ్రీనివాస్ విషయంలో కంపెనీ యాజమాన్యం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ట్యాంకర్లు పేలి ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు.

అనకాపల్లికి చెందిన శ్రీనివాస్ ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి నుంచి అతని ఆచూకీ దొరగడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన వచ్చారు. శ్రీనివాస్ గురించి ఆరా తీశారు. శ్రీనివాస్ గురించి సెక్యూరిటీ సిబ్బందిని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు అన్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా చూపించడం లేదని అన్నారు. 

శ్రీనివాస్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారా అనే సందేహం కలుగుతోంది. ఇంతకీ అతను ఏమయ్యాడనేది ప్రశ్నగానే మిగిలింది. ప్రమాదంలో నలుగురు మాత్రమే గాయపడినట్లు చెబుతున్నారు. గాయపడినవారిలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడని, అయితే అతను తమ శ్రీనివాస్ కాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. 

ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో ఉన్నవారంతా బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నరని, వారిలో ఒక్కరికి మాత్రమే తీవ్రమైన గాయాలయ్యాయని అంటున్నారు. అయితే, శ్రీనివాస్ ఫోన్ రింగ్ అవుతోందని, దానివల్ల అతను క్షేమంగానే ఉన్నాడని భావిస్తున్నామని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. విశాఖ సాల్వెంట్‌ కంపెనీ‌లో ఈ పేలుడు సంభవించింది. సీఈటీపీ సాల్వెంట్‌ను రీసైల్‌ చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. 

సాల్వెంట్‌ స్టోర్‌ చేసే రియాక్టర్‌ ట్యాంకులో పేలుడు జరిగింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

ప్రమాద స్థలానికి చాలా దూరంగా  అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి.  మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. 

కంపెనీలో భారీ శబ్ధాలతో ట్యాంకులు పేలాయి. వర్షం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పేలుళ్ల శబ్దాలకు ఫైరింజన్లు సమీపంలోకి వెళ్లలేకపోతున్నాయి. ప్రమాద స్థలానికి దూరంగా నిలిచిపోయాయి. ప్రమాద స్థలానికి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఆర్డీవో కిశోర్ చేరుకున్నారు. ప్రమాద స్థలానికి భారీగా తరలిస్తున్నట్లు కలెక్టర్ వినయయ్ చంద్ చెప్పారు. 

ప్రమాదంపై పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. స్థానికులను విధుల్లో ఉన్నవాళ్లను తరలించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు

సోమవారం (జులై 13) రాత్రి సుమారు 11 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమ నుంచి 2, 3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తున్నాయి.

పరిశ్రమ నుంచి పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన విషాదం నింపిన నేపథ్యంలో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios